సాహితీ శ్రద్ద – రామతీర్థ
ఉన్నట్టుండి ఆకస్మికంగా విమర్శ ఉక్కిరి బిక్కిరి అయ్యింది. కవిత్వం కల్లోలంలో కొట్టి మిట్టాడింది. అనువాదం కృంగిపోయింది, అలసిపోకుండానే అర్ధాంతర ఆగిపోయిన
అక్షరయోధుని శ్వాసను నిరసిస్తూ సాహిత్యమే తన వంతు నివాళి అర్పించడానికి విశాఖ
ప్రయాణమైంది . చదవడం రాయడం తప్ప ఏమి చేయాలో తెలియని
తనం కలాన్ని కాలానికి అప్పగించి హఠాత్తుగా
ఆకాశంలో ఆవిరైపోయి సాహిత్యలోకంలో భూకంపం సృష్టించింది. వై.ఎస్. రాంబాబుగా జన్మించి రామతీర్ధగా అవతరించిన ఆ అక్షర ప్రస్థానం అరవై
ఏళ్ళు నిండకుండానే విశ్రమించాలని తీసుకున్న నిర్ణయం, దురదృష్టకరం. ఒడిస్సాలో ఖుర్దారోడ్ ప్రాంతంలో 1960 జులై 17 పుట్టిన రాంబాబు తండ్రి డాక్ సేఫ్టీ ఉద్యోగి.
అదే వరమైయింది. వంగ, కళింగ భాషల్ని జన్మతహా అబ్బించు కున్నాడు. అందుకే ఒడియా ఫకీర్ మోహన్ సేనాపతి అంటే అమితమైన ప్రేమ. ఒడియా సాహిత్యం ప్రస్తావన వచ్చినా, బాల్య స్నేహితులు కలిసిన చాలు
పులకించిపోయి ఒడియాలో కవిత్వం వల్లిస్తాడు. బెంగాళీ సాహిత్య ప్రస్తావన
వస్తే బిద్రోహి కవినో టాగోర్ నో
గుర్తు చేస్తాడు. 1921లో కాజి నజ్రుల్
ఇస్లాం రాసిన బెంగాలి కవితని బెంగాలీ యాసలో హావ భావాలతో పాడేస్తాడు. బెంగాళీయులకు రవీంద్రనాథ్ టాగోర్ అన్నా తమ సాహిత్యం అన్నా ఏంటో గౌరవం
. మన ఆంధ్రులు కూడా అదే విధంగా తెలుగు
సాహిత్యాన్ని తెలుగు కవులను గౌరవించాలని అభిలషిస్తాడు. తన జీవితంలోని అన్ని
దారుల్నీ మూసేసుకుని ఒక్క సాహిత్య
ద్వారాన్ని మాత్రం తెరచి ఆ గవాక్షం లోంచి ప్రపంచ సాహిత్యాన్ని వీక్షించాడు. ఉభయాంధ్ర రాష్ట్రాలలో సాహిత్యాన్ని తన చిరునామాగా చేసుకుని ఎక్కడ ఏ
వేదిక దొరికినా నిర్మొహమాటంగా తనదైన గొంతును వినిపించే వాడు.
కవిత్వం, కధా రచన, అనువాదమూ, గేయ రచన , రేడియో రూపక రచన, నిర్మాణం , నాటికలు, సాహిత్య విమర్శ, పరిశోధన, పత్రికా సంపాదకత్వం, సమకాలీన జాతీయ/ప్రపంచ సాహిత్య విషయంగా శక్తివంతమైన ప్రసంగాలు, తెలుగు ఇంకా ఇంగ్లీష్
భాషల్లో వ్యాస రచన, సమాంతరంగా ప్రాచీన ఆధునిక ధోరణుల్లో
సామాజిక నిష్ట, భాషా చరిత్ర లో పరిపూర్ణ సదావగాహన
వెరసి రామతీర్ధ. ఆధునిక సాహితీ సమాజంలో మనుగడలో నున్న అన్ని
సాహిత్య ప్రక్రియలను అలవోకగా ఒక్క రామతీర్ధ లోనే మన చూడగలం
అంటే అతిశయోక్తి కాదు. ప్రతీ ప్రక్రియలోనూ నిత్య నవీనతను తన
బాణీ చేసుకుని సాహిత్యమే సమాజము అనే సజీవ బంధాన్ని నిరంతరం నిర్వహిస్తున్న భాషా
మా౦త్రికుడు రామ తీర్ధ. వక్త గా ఏకధాటిగా అతడు ప్రగంగం వింటే
శ్రోతలు చేష్టలుడిగి పోవాల్సిందే. దీనికి ఎందరో సాక్షులు మనకు నిత్యం కనబడుతూ ఉంటారు. సామాన్యంగా ఎంతో నిబ్బరంగా హుందాగా ప్రశాంతంగా కనిపించే ఇతడు సాహిత్య విమర్శకుడిగా ఉగ్ర రూపుడైపోతాడు. విషయ పరిజ్ఞానము పట్ల తనకున్న లోతైన అవగాహనే ఆ అసహనానికి కారణమని గమనించాలి. సంబ౦ధిత విషయాన్ని రుజువులతో నిరూపించగల సత్తా అక్కడ ప్రకటించిన
నిరసనకూ, అశాంతికీ కారణంగా మనం భావించాలి. విమర్శను విమర్శగా కాకుండా వ్యక్తిగతంగా తీసుకునేవారందరూ అతడికి
శత్రువులుగా మారిపోతారు. తన విమర్శను తట్టుకోలేవారెందరో
శత్రువులుగా మారిపోయారు. కానీ, తానెప్పుడూ ఎవ్వరి పట్లా భేషజాన్ని
ప్రదర్శించలేదు. అయితే కొన్ని అరుదైన సందర్భాల్లో
వ్యక్తిగతంగా కొందరిపై ఉద్దేశపూర్వకంగా సాహిత్య అసహనాన్ని ప్రదర్శించడం బహిరంగంగా
సవాలు చేయడం తెలిసిన సంగతే.
తెలుగు నుండీ
ఆంగ్లం లోనికీ, ఆంగ్లం నుండీ తెలుగులోనికి వంద
మందికి పైగా కవుల కధకుల రచనలను ఉభయ భాషలలోనికి అనువదించడం
బహుసా రామ తీర్ధకు మాత్రమే సాధ్యం. దాదాపు మూడు వందలకు పైగా ముద్రితమైన
సాహిత్య విమర్శ, విశ్లేషణ పరిచయ వ్యాసాలు ఆయన సొంతం. జనగణ మన గీతానికి నూరేళ్ళ ను పురస్కరించుకుని “నూరేళ్ళ జనగణమన” అంటూ జాతీయ గీతానికి
శతవత్సరోత్సవాన్ని జరిపి అదే పేరుతో పుస్తకాన్నిప్రచురించిన జాతీయ వాది. అందులో మనకు చాలా మందికి తెలియని జాతీయగీతం పూర్తి గీతాన్ని,అలాగే టాగోర్ 1905 యువకుడిగా ఉద్వేగభరితంగా రాసిన “ అమార్ సోనార్ బాంగ్ల ...” గీతాన్ని “ నా బంగారు బెంగాలు సీమ, నీకేనమ్మా నా ప్రేమ “ అంటూ అనువాద గీతాన్నీ అందించాడు. జనగణమన గీతం వివదాన్నీ ,గీతాంజలి
నేపధ్యాన్నీ మరెన్నో వివరాలను ఆ పుస్తకంలో పొంది పరిచాడు. శ్రీశ్రీ అంటే వాళ్ళ మాలిన పిచ్చి , గురజాడ అంటే అమితమైన గౌరవం. శ్రీ శ్రీ కి ఎన్ని విధాలుగా అక్షర నీరాజనం అర్పించాలో అన్ని రకాలుగా
విభిన్న సాహితీ ప్రక్రియల ద్వారా ప్రకటించి శ్రీ శ్రీ పట్ల తనకున్న సాహిత్య నిబద్దతను చాటుకున్నాడు. “శ్రీ శ్రీ శత జయంతి పాటల ఆల్బం” ను రచించి ప్రసార మాధ్యమాల ద్వారా శ్రీ శ్రీని సామాన్యులకు మరింత
చేరువ చేసాడు. దేశంలో వివిధ ప్రాంతాలలో జరిగే
సాహిత్య అకాడమీ సభల్లో రామతీర్ధ చేసిన తెలుగు ఆంగ్ల సాహితీ ప్రసంగాలు విన్న వారిలో
ఎందరో ప్రముఖులూ, ప్రజా ప్రతినిధులు ఇతర భారతీయ భాషా కవులూ అతని అభిమానులుగా
మారిపోయారు. ఆంధ్రా యూనివర్సిటి అకడెమిక్ స్టాఫ్
కాలేజ్ లో ఉపాధ్యాయులకూ ఇతర అకాడెమిక్ శ్రేణులకు శిక్షణా ప్రసంగాలు చేసాడంటే అతడి
సాహిత్య ప్రావీణ్య విస్తృతి అవగతం అవుతుంది.
ఎంతసేపూ సాహిత్య ప్రసంగాలే అయితే మూస పద్దతిగా ఉండి సాహితీ ప్రియులను
విసిగిస్తాయని పసిగట్టి, పవర్ పాయింట్ ద్వారా ఎందరో ప్రాచీనాంధ్ర కవులను, ఆధునికాంధ్ర కవులను పరిచయం చేసి
యువతకు విద్యార్ధులకు సాహిత్యం పట్ల ఆసక్తినీ, అవగాహనను పెంచిన సాహితీ సృజనశీలి రామతీర్ధ . భాస కవి, గురజాడ, శ్రీ శ్రీ, ఆరుద్ర, ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు ఆర్.కే.లక్ష్మణ్ ,చాసో, సలీం ఇలా ఎందరినో సాహితీ అభిమానులకు
దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా సామాన్యులకు పరిచయం చేసి దగ్గర చేసాడు. మొజాయిక్ ఆంగ్లానువాద పత్రికను కొంత కాల నిర్వహించి కాస్త విరామ
తర్వాత మళ్ళీ మోజయిక్ సాహిత్య వార పత్రికకు ఈ మధ్యే జీవం పోసాడు. రామతీర్ధ రచనల్లోకి చూస్తే అవి ఎంత ప్రకాండముగా శ్లాఘనీయంగా
రాసాడోనని ఆశ్చర్యం కలుగుతుంది. తొలి కవితా సంపుటి “తెల్ల మిరియం” ఆ రోజుల్లో ఒక సంచలనం. 1999లో మా నాన్నగారు
మరణించిన తర్వాత ఆయన పుస్తకాలు సర్దుతుంటే ఈ “తెల్ల మిరియం” బయట పడింది. అదే నాకు తొలి పరిచయం.అది చదివే నేను ఆయన అభిమానిని అయ్యాను. ఇప్పుడు ఆ పుస్తకం మా ముగ్గురికీ ఒక ఆత్మీయ జ్ఞాపకం. ఆ శీర్షికే చాలామందికి అర్ధం కాలేదంటే(మొదటిలో నాకు కూడా) ఆనాటికే అతడి భావుకతా సామర్ధ్యం ఏమిటో
అర్ధం అవ్తుంది. అనువాదాల్లోకి వెళితే కెన్ సారో వివా
స్మృతికి పదేళ్ళు సంపుటి గురించి చెప్పాలి. ప్రతిభావంతుడైన నైజీరియా దేశపు కవి కెన్ సారో వివా. సామాజిక విప్లవకారుడు, పర్యావరణ పరి రక్షకుడు, ప్రజా పక్షపాతి, పెట్రోలియం క్రూడ్ ఆయిల్
పరిశ్రమలు కల్గిస్తున్న కాలుష్యంపై అహింసా పద్దతిలో నిరసన ఉద్యమం చేసినవాడు. నైజీరియా ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించిన చైతన్య వంతమైన
వ్యక్తిత్వం కెన్ సారో వివా .అతడిని నైజీరియా ప్రభుత్వం ఉరితీసి
చంపింది . అతడు
1995లో మరణిస్తే
అతన స్మృతికి పదేళ్ళు నివాళి సంపుటి ని 2005 ప్రచురించడం తెలుగు సాహితీలోకానికి పరిచయం చేయడం ఇతని గొప్పతనం. “శతాబ్ది శ్రీ శ్రీ “, కన్యాశుల్క
కవితోత్సవం, రామతీర్ధ సాహిత్య పరిశీలనకు మరో
ఉదాహరణ . కేవలం గురజాడ కన్యాశుల్కం నాటకం మీదే
ముప్పై వరకు విస్తృతంగా కొత్త దృక్కోణాల నుండీ వ్యాసాలు రాస్తూనే మరొక ప్రక్క అదే
నాటకం ఆధారంగా అక్షర శీర్షికలతో అంటే “అ” నుండీ “ఱ” వరకు 52 కవితలు రాయడం ఒక అరుదైన సాహిత్య విన్యాసం.
దేశాన్ని కుదిపేసిన దుర్ఘటన నిర్భయ పై దురాగతం. ఆ నిర్భయ ఉదంతంపై వచ్చిన ఏకైక
దీర్ఘ కవిత తెలుగులో మాత్రమే వచ్చింది. అదీ రామతీర్ధ రాసిందే కావడం విశేషం. “హుదుద్ నగర
కవిత్వం” హుదుద్ వచ్చి నగర జీవితాన్ని ఎంతగా
అతలాకుతలం చేసిందో కళ్ళకు చూపిస్తుంది.
ఇరవై శతాబ్దపు ప్రసిద్ద ఫ్రెంచ్ కవి
నవలాకారుడు విమర్శకుడు గిల్లేమి
అపోలినర్ “జోన్” కవిత
అనువాదం మరొక సాహసం. ఇది 155 లైన్ల చిన్న
కవిత, కానీ పదాల కూర్పులో అనేకమైన
వ్యత్యాసాలతో ఎంతో పొడవైన వాక్యాలతో నిర్మితమై ఉంటుంది. ఆ కవితలో కవి విరామ చిహ్నాలకు విలువనివ్వకుండా పదాల ప్రవాహాన్ని
ఎంతో ఎరుకతో క్లిష్టంగా అల్లుతాడు. అటువంటి కఠిన మైన పదాలున్న కవిత్వాన్ని సవాలుగా తీసుకుని అనువదించడం రామతీర్ధ
కవికే చెల్లుతుంది. జెండా పై గురజాడ ఒక వినూత్న ప్రయోగంగా గురజాడకు అర్పించిన ఒక
సాంస్కృతికాంజలి. ఇందులో పాత్రలన్నీ కన్యాశుల్కం లోనివే, కానీ అవే పాత్రలు ఒకింత భవిష్యత్లోనికి ప్రవేశిస్తే ఏమి జరుగుతుందో
ఊహాత్మకంగా చేసిన రచన ఇది. అక్కడ బుచ్చమ్మ ఇక్కడ డాక్టర్
బుచ్చిలక్ష్మి గా కనిపిస్తుందంటే ఈ ప్రయాగం ఎంత అభ్యుదయాత్మకంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఈ లఘు నాటికను విజయ నగరం గురజాడ స్కూల్ బాల బాలికలు ఆంధ్రా యునివర్సిటీ లో ప్రదర్శించడం మరొక విశేషం. అలాగే కన్యాశుల్కం నూట ఇరవై
అయిదు ఏళ్ల సందర్భ ఈ లఘు నాటిక ఉత్తరాంధ్రలో పలు చోట్ల ప్రదర్శితమై మన్ననలను
అందుకుంది . రాచకొండ నరసింహ శర్మ (రవి శాస్త్రి గారి
తమ్ముడు)
రాసిన ఆంగ్ల కవిత్వానికి తెలుగు అనువాదం”అన్నపూర్ణాక్షరం” , రావి సారాలు (రాచకొండ విశ్వనాధ శాస్త్రి సాహిత్య
వ్యాసాలూ ) ఇలా చెప్పుకుంటూ పొతే చిట్టా
పెరిగిపోతుంది. సందర్భోచిత కవితలు కోకొల్లలు ఉన్నాయ్ . సుమారు 40 సంవత్సరాల అక్షర సేద్యం చైతన్యవంతంగా దాదాపు 40 పుస్తకాల వరకూ పండించింది. జూన్ ఒకటవ తారీఖున ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా రామతీర్థ చేసిన సత్యవతి చరిత్రము
(ఆంగ్లానువాదం) ఆవిష్కరణ కావాల్సింది. చెన్నై తెలుగు వాణి తూమాటి సంజీవరావు గారు
సనకలనం చేసిన “వీరేశలింగం స్మృతిలహరి” రాసిన
ఆవిష్కరణకు సిద్దమౌతున్న తరుణంలో ఈ దుర్విధి విషాదకరం .
సాహితి నూతన అంశాలను వెలికి తీసే సాహసాన్ని ఊపిరిగా జీవించిన అసాధారణ
సాహిత్య కృషీవలుడు రామతీర్ధ. కందుకూరి శ్రీ శ్రీ గురజాడ చలం చాసో
మీద చేసిన విశేషమైన పరిశోధనలు సాహిత్య చరిత్రలో రానున్న కాలంలో మరిన్ని పరిశోధనలకు
మార్గదర్శకంగా నిలుస్తాయనడంలోని సందేహం లేదు . కన్యాశుల్కం లోని పంచతంత్ర పరిమళాలు ,కన్యాశుల్కం లోని ముద్దుల సంఖ్యను విశ్లేషిస్తూ ముద్దుల గురజాడ , ఉర్దూ పదాల ఔచిత్యాన్ని వివరిస్తూ రాసిన వ్యాసం, మృచ్చకటికము నేపధ్యాన్ని
అన్వయిస్తూ మట్టి బండి లో కన్యాశుల్క జైత్రయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకే
దారితీసింది. ప్రసిద్ద విమర్శకులు యు వి ఎన్
నరసింహమూర్తి గారి నాటకాలమీద చేసిన పరిశోధనా గ్రంధం ఆధారంగా తన వాదనను
నిరూపించుకోగాలిగాడు. ఆయన వ్యాసాల్లో కన్యాశుల్కం నాటకం పాశ్చాత్య ప్రభావాలు వివరించడం
మరొక కొత్త కోణం. తెనుగు త్రిజట (తెలుగు రామాయణాల్లో త్రిజట పాత్ర సమాంతర అధ్యయనం ), గురజాడ రచనలకు ప్రేరణ అయిన ప్రపంచ సాహిత్య రచనలను ఆవిష్కరించడం, కన్యాశుల్కం 1887 మొదటి ప్రతిని
సేకరించి డిజిటల్ రూపంలో భద్రపరచడం , కాలగర్భంలో కలిసి పోయిన కందుకూరి ఆంగ్ల
ప్రసంగాన్ని వెలికి తీసి సాహిత్యలోకానికి పరిచయం చేయడం, చెన్నై తెలుగు సంస్థ మరియు
చెన్నై తెలుగు ప్రకాశంతో కలిసి క్రాంత దర్శి కందుకూరి శతవర్ధంతి సంచిక ప్రచురణలో భాగస్వామిగా పనిచేయడం లాంటి అనేక విస్తృత
పరిశోధనాధ్యయనం రామతీర్ధను ఇతర సమకాలీన సాహితీవేత్తలకు భిన్నంగా ఔత్సాహిక సాహితీ
వేత్తలను స్పూర్తిగా నిలిపాయి. ఇటు అభ్యుదయ సాహిత్యాన్నీ అటు
సంప్రదాయ సాహిత్యాన్ని మరొక ప్రక్క పాశ్చాత్య సాహిత్యాన్నీ సమాంతరంగా ఔపాసన చేసిన
రసజ్ఞత తో అన్వయించడానికి ఎంతో అసాధారణ మేధ అవసరం. దాన్ని పరిపుష్టి చేసుకున్నవాడు .
సాహిత్య అకాడమి
పత్రిక అయిన ఇండియన్ లిటరేచర్ 1981లోనే రామతీర్ధ
ఆంగ్లానువాద రచనలు ప్రచురిత మైయ్యాయి. రామతీర్ధ ఆంగ్లలోకి అనువదించబడినవాటిలో గురజాడ కథలు , కందుకూరి కవిత్వం, శ్రీ శ్రీ మహాప్రస్థానం మొదలుకుని
విశ్వనాధ, కాళీపట్నం రామారావు, కృష్ణశాస్త్రి, శివారెడ్డి, కేతు విశ్వనాధ రెడ్డి ,పాపినేని
శివసంకర్ ,కొండేపూడి నిర్మల, మందరపు హైమావతి, పాటిబండ్ల రజని ,జగద్ధాత్రి, ఎ.ఎన్ జగన్నాధ శర్మ, దేవీప్రియ, దాట్ల దేవదానం రాజు, ప్రసాద మూర్తి, మువ్వా శ్రీనివాస రావు, విజయ చంద్ర, చిన్ని నారాయణ రావు వంటి
సీనియర్ రచయితలూ కవులు నుండీ సాహిత్య అకాడమి యువ సాహిత్య పురస్కారం అందుకున్న
మంత్రి కిష్ణమోహన్ వంటి యువ రచయితలెందరో దాదాపు వందమంది వరకూ ఉంటారంటే నమ్మశఖ్యంగా
లేదు కదూ..! .
ఆంగ్లం
నుండీ తెలుగులోనికి అనువదించబడినవి కూడా సుమారు అదేసంఖ్యలో ఉండడం ఆశ్చర్యమే కాదు
ఏదైనా అనిర్వచనీయమైన శక్తి పూనిందా అనే
అనుమానమూ వస్తుంది. టి ఎస్ ఇలియట్ రాసిన వేస్ట్ లాండ్
దీర్ఘ కవితను వృధాత్రి పేరుతో అలాగే అతని అనేక ఇతర రచనలను, నజ్రుల్ ఇస్లాం బిద్రోహి
కవిత్వాన్ని బెంగాల్ నుండీ తెలుగులోనికి , అపోలోనర్ రాసిన జోన్, రష్యా కవి అలెక్షాండర్ బ్లాక్ ‘ది ట్వెల్స్ ‘,లాటిన్ అమెరికా కవి వోట్తో రినో
కాస్టిలో కవితల అనువాదం, సిరియా దేశపు కవిత్వ అనువాదం,విపుల పత్రికలో ప్రచురితమైన అనేక
ప్రపంచ కధానికలు రామతీర్ధ సాహిత్య వైశాల్యాన్ని అతనికి గల ప్రాపంచక చుట్టూ
చూపునూ, ఆధ్యాయన విస్తృతినీ , పరి పూర్ణ రూపాత్మక సాహిత్య అవగాహనను రేఖామాత్రంగా తెలియజేస్తాయి.
‘సావిరహే తవదీన’ గురజాడ ‘దిద్దుబాటు’ కధకు శ్రావ్య నాటిక రూపం ఆకాశవాణి విశాఖ ప్రసారం చేసింది. , అల్పజీవుల జెండా రాచకొండ రూపకం, జెండాపై గురజాడ చిన్నపిల్లల నృత్య రూపకం ఇతర సాహిత్య సాహస సహ ప్రక్రియలు. రంజని కుందుర్తి పురస్కారం, శ్రీ శ్రీ వచన కవిత్వ అవార్డు, ఒడిస్సా వారి ఉత్కల్ సాంస్కృతిక సమ్మాన్, గురజాడ అవార్డు, లైన్స్ క్లబ్ విశాఖ అవార్డు, రావి శాస్త్రి పురస్కారం, చాసో పురస్కారం, మునిపల్లి రాజు స్మారక పురస్కారం
లాంటివి ఎన్నో అందుకున్నా మరెన్నో
ప్రతిష్టాత్మక పురస్కారాలెన్నింటికో అర్హత ఉన్నవాడు సభల నిర్వాహణలో కూడా
చలంస్తాన్ ఇంకా ఎన్ని నవీన సాహితీ వేడుకలు
నిర్వహించడానికి పధకాలు తయారుచేసాడో జీవం మొండికేసింది. సభల నిర్వాహణలో వినూత్న పద్దతులను ప్రవేశ పెట్టడానికి ,ప్రయాగాలు చేయడానికి వెనుకాడని దృఢ సంకల్పం కలవాడు. మే మాసంలో రామతీర్ధ రూపొందించి ప్రదర్శింపచేసిన “చలంస్తాన్” చలం
125 జయంతి వేడుకలో
చలం రచనలలోని స్త్రీల పాత్రలను ప్రసంగాలకు బదులుగా ఏక పాత్రాభినయం చేయించిన తీరు
అత్యంత ప్రసంశనీయం.
మొజాయిక్ సాహితీ సంస్థ స్థాపించడం వెనుక ఎంతో ఆలోచనాత్మకమైన ఆచరణ ఉందని
చాలా కొద్ది మందికే తెలుసు. విభిన్న రంగురంగుల సాహితీ సుమాలను పుష్పించే పూలతోటగా కొందరనుకుంటే
నిజమే “గార్డెన్ అఫ్ ఐడియాస్ “ అని రామతీర్ధ ఉద్దేశం. అన్ని రకాల రంగుల రాళ్ళు అద్దిన నేల లేదా వివిధ రకాలతో కూడిన రంగుల
ప్రక్రియ అని అర్ధం చేసుకుంటే మొజాయిక్
అంటే భిన్నత్వంలో ఏకత్వం అని అతని భావన. దక్షిణ ఆఫ్రికాలో మోజయిక్ అనేది రంగుల పలకలతో గోడల మీద నగిషీలతో చిత్రాలను
అద్దే సాంస్కృతిక కళగా ప్రాచుర్యం పొందిన విద్య. అందరూ సాహిత్యంలో వారి వారి వివేకం,వివేచన మేరకుటం రుచులను
వెతుక్కోవచ్చు అనేది మరొక ఎత్తుగడ . అమెరికా న్యూయార్క్ లో మనుగడలో ఉన్న
ఆఫ్రికన్ అమెరికన్ల అంటే అమెరికా నల్ల జాతీయుల
సాహితీవేత్తల వారసత్వంగా వస్తున్నా
నిరసన గళం వినిపిస్తున్న సాహిత్యం సంస్థ పేరు కూడా మొజాయిక్ . ఇన్ని దృష్టి కోణాల నేపధ్యాన్ని ఆలోచించి వాటన్నిటికీ ప్రతీకాత్మగా ఈ
పేరు పెట్టడం జరిగింది. స్థాపించిన మొజాయిక్ సంస్థ ద్వారా వారం
వారం విశ్వ సాహిత్య విహారం చేయించేందుకు “మండే మొజాయిక్” పేరున ప్రతీ సోమవారం సాయంత్రం పౌర గ్రంధాలయంలో సాహితీసభలు
నిర్వహించాడు. సాహిత్యంతో రంజింప చేయడానికి సంస్థ
సిద్దంగా ఉన్నా సాహితీ ప్రియులు కరువు అవడంతో అది తాత్కాలికగా ఆగింది. అయితే అదే పేరుతో ప్రతీ వారం వెబ్ మాగజైన్ ప్రచురించడం ప్రారంభించాడు. లీడర్ దిన పత్రికలో రైటర్స్ అకాడమీ పేరుతొ సాహిత్య పేజీని కూడా
నిర్వహిస్తున్న సాహితీ సవ్యసాచి . మొజాయిక్ సంస్థ వందల్లో సాహిత్య సభలను
నిర్వహించి పదుల సంఖ్యలో దేశవ్యాప్తం గా లబ్ద ప్రతిష్టులైన సాహితీవేత్తలను
ఆహ్వానించి విశాఖ సాహితీ లోకానికి పరిచయం చేసి తన ప్రత్యేకతను చాటుకుంది మొజాయిక్
సంస్థ రామతీర్ధ ద్వారా..
వ్యక్తిగా రామతీర్ధ సహృదయుడు, సంస్కారి, నిబద్దత కలిగిన కార్యశీలి, స్నేహ స్వభావి . పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరితోనూ వ్యక్తిగతమైన సౌహార్ద సత్సంబంధాలను
కొనసాగించడం రామతీర్ద కే ప్రత్యేకం. సాహిత్య పరంగా అందర్నీ కలుపుకుని పోవాలని తపన కలిగిన వాడు. కానీ కొన్ని సందర్భాల్లో అతడు
ప్రదర్శించిన సాహిత్య అసహనం తన వ్యక్తిత్వ స్థాయిని కొంత తగ్గించిందని చెప్పవచ్చు . కొందర్ని దూరం కూడా చేసుకోవాల్సి వచ్చింది. అలాగే కేవలం ఒంటెద్దు పోకడలా ఒకే వర్గానికి చెందినా వారినే భుజాన
ఎత్తుకున్నాడనే అపవాదు కూడా అక్కడక్కడ వినిపించడం కూడా నిజమే. ఏదేమైనా తనదైన జీవితాన్ని తనదైన శైలిలో స్వేచ్ఛా విహంగ ద్రుష్టితో
సాహితీ సహచరణం చేసాడు. సహచరిణిగా జగద్ధాత్రి అందించిన సాహితీ మద్దతు , నైతిక ఆసరా , విద్వత్ చేదోడు త్యాగమూ అతని కృషినీ ప్రయత్నాలను సఫలీకృతం చేయడానికి ఎంతో
తోడ్పడ్డాయి.
విశిష్ట మైన సాహితీ శ్రద్ద రామతీర్ధ. అతని అడుగుల్లో అడుగులేయాలని కలం పట్టిన వర్ధమాన కవులను రచయితలను నిరుత్సాహపరచకుండా తనవంతు నూరుశాతం సహాయ సూచనలను అందిస్తూ
ప్రోత్సహించాడు. అతని సాహిత్యాన్ని అభిమానించేవారు
రామతీర్ధ ఒక విశ్వవిద్యాలయం అని పిలుచుకోవడంలో కూడా అతిశయోక్తి లేదు. బహుశా ఈ మధ్యకాలంలో సాహిత్యాన్ని, సాహిత్య వేదికలను, దిన వార మాస పత్రికలను ఇంతగా ప్రభావితం చేసిన
సాహిత్య వ్యవహార్త రామతీర్ధ. రామతీర్ధ సాహిత్య కృషి , విశాఖ సముద్ర అలల ఘోష సర్వకాలీనం. ఆయన వక్తృత్వపు స్వర ధార నిరంతరం తెలుగు సాహిత్య నాడుల్లో
ప్రవహిస్తూనే ఉంటుంది. విశాఖ సాహితీ శిఖరం మీద రామతీర్ద
పాండిత్య పతాక నిరంతరం ఎగురుతూనే ఉంటుంది.జూన్ 9 ఆదివారం సాయంత్రం అన్ని సాహిత్య సంస్థలు, ప్రముఖ సాహితీవేత్తలు, సాహిత్య అభిమానులూ,ప్రజా ప్రతినిధులూ రామతీర్ధకు అత్యంత సన్నిహితమైన విశాఖ
పౌరగ్రంధాలయంలో ఆ అక్షర యోధునికి నివాళి అర్పించడానికి సమావేశమౌతున్నారు.
డాక్టర్ మాటూరి
శ్రీనివాస్ (01-06-2019)