Wednesday, 17 September 2014

మనసు

ఏమిటది?                                            
                                             డా. మాటూరి శ్రీనివాస్ 
అది ఒక ప్రయోగశాల , విద్వత్తుల భాండాగారం
అస్తిత్వపు కుహరంలో నిక్షిప్తపు జ్ఞాన గని ,
అది సముద్రపు అగాధం , నీతుల లోతుల ఊబి .         
 దాని అంచుల తీవ్రతను తాకడం ఎవ్వరి తరమూ కాదు,
 అంతర్గత సంక్లిష్టత ను ఆవిష్కరించడం వృధా ప్రయాసే అయినా ,
అ సీమలో పయనించడం అంటే ,
నిన్నునీవు తెలుసుకోవడమే కాదు, విస్తృత పరుచుకోవడం కూడా .
అది అంతు చిక్కని, చిక్కని ఆలోచనల అంతర్ముఖ సులోచనం  ..
కానరాని  కల్పనలను ఊహిస్తూ
 మానవాళి మనుగడనే శాసిస్తూన్న ప్రజ్ఞా పరిపూర్ణ  ప్రతీక ,
 అజ్ఞానంధకారం లోకరదీపిక .
నిత్య చైతన్యపు నిండు జాబిల్లి వెన్నెల చిత్రం ,
దాన్ని గీయలేము, చూడలేము,తాకలేము .
అలసిపోదు,సోలసిపోదు నిరంతరం నిశ్చల స్రవంతి ,
అక్షరాన్ని ఆయుధంచేసే కార్య క్షేత్రం ,
శిక్షణ తో రక్షణ కల్పించే వీర్య నేత్రం .
ధ్యానం, గానం. భాష్యం ,లాస్యం ,
యధాభూతదర్శనం , నిత్యం సత్యాన్వేషణం,
 కార్యా కారణం సంకీర్ణం దాని తక్షణ కర్తవ్యం .
నిన్నటి రేపుకి రేపటి నిన్నకి అను సంధాన వ్యక్తిత్వం
పంచేంద్రియాల సమూహపు ఆరవ ఇంద్రియం,
మేధ అను ,మస్తిష్కపు శోధ అను లేదా వ్యధామృత గాధ అను
 నిరంతర వికసిత సుగంధ మహిమాన్విత అమూల్య మాల్యము
 ..... మనసు.  


మాట్లాడుకుందాం


ఎందుకు మాట్లాడుకోవాలి?
               డాక్టర్ మాటూరి శ్రీనివాస్

పొద్దువేళ మొదలు, పొద్దు గూకే దాకా
తెగ మాట్లాడేసు కుంటామా,
ఏమంటే , మాట్లాడుకోవాలికదా ! అంటాం  .
అక్కడ నుండి పారిజాతాలు రాలినట్లు మాటలు రాలిపోతాయి ,
సుగంధం మాత్రం సర్వ ఆమోదయోగ్యం కాదుగా .
కొందరికి వెగటు,కొందరికి ఉల్లాసం, ఇంకొందరికి పడిశం .
కొన్ని మాటలు అప్పుడే మార్చేస్తూ వుంటాం,
 కెరటాలల వచ్చి పోతూ ఉంటాయా, అరిపోయినట్టున్నా లోని చమ్మ ఇంకిపోదు .
అవసరానికి అప్పుడప్పుడు రాజకీయమాటలూ అడుతాం
వినాయకుడు పాలు తాగినట్లు , షిర్డీ బాబా కళ్ళు తెరిచ్నట్లు నమ్మేస్తాం.
తెలిసీ మోసపోవడంలోని ఆనందమే వేరు.
ఎలక్షన్ల వేళ వాగ్ధానపు కబురులూ చెప్పేస్తాం పిల్లలకీ,పెద్దలకీ
 స్వర్గానికి వేసిన బాణాల నిచ్చేనెక్కి అక్కడే విహరిస్తూ వుంటారు.
ముభావపు చిటపట మాటలు ఎటో చూస్తూ
బోగంవిల్లాల్ల రంగురంగులలో ఎంత అసహజంగా, చులకనగా ఎగురుతాయో,
ముల్లులు మాత్రం ఎంత సలుపిస్తాయో తెలియనిదేవ్వరికి?
సమ్మగా గుచ్చుకున్నా పర్లేదు , కమ్మగా గుబాళిస్తూ
రోజులు తరబడి తలుచుకునేలా ,వాడిన కొద్దీ పరిమళిన్చే
రెండు స్వాంతన కలిగించేవి , ఒక్కొక్కప్పుడు ఘాటుగా వున్నా
ఎప్పుడో ఒకప్పుడు ఆస్వాదించేందుకు , మనసు మాటలు
 మొగలి రేకుల్లా .... 



గాజా

నిర్జీవితం
                       డా .మాటూరి శ్రీనివాస్
                      
అక్కడ గోడలు ఖాళీ కుర్చీలను ప్రశ్నిస్తున్నాయి
స్మశానపు వైరాగ్యం తో సమాధుల ఫలకాలను
మరిపిస్తున్న కుర్చీలు   - నిన్న మొన్నటి పసి బాల్యాన్ని
నెమరువేసుకుంటూ , మౌనంగా రోధిసున్నాయి.
వాటిచుట్టూ మసలిన కేరింతల కలల సౌధాలు
కూలిన శబ్దాలతో బధిరులై పోయి బిక్క చూపులు చూస్తున్నాయి.
మొండిగోడలు బాంబు దాడుల సాక్షిగా నిర్వీర్యపు నిస్సహాయ గీతాలు ఆలపిస్తున్నాయి ,
వైమానిక విన్యాసాల రణ ధ్వనుల  బాజాలతో .
మానవ మృగాల క్షిపుణుల గర్జనలు పంజాలై   సిమెంటు అడవుల్లో కవాతులు
చేస్తూ , కోరలు చాస్తూ జీవుల్ని కబలించేస్తూ
త్రేంచు కోవడానికి కూడా సంశయిస్తూ జీర్నిన్చేసుకున్తున్నాయి  ..
ఎక్కడో,ఎదో  పేలిన శబ్దానికి బిక్కు మంటూ ఇక్కడ నుండే
 ఆ దూరాన్ని,భారాన్ని, గాల్లో కలసిన ప్రాణాలని లెక్కేసూ
నా వంతు ఎప్పుడో? అన్న స్వగతాన్ని పీక నలిపేస్తూ గడిపేస్తున్న నిర్జీవితం.
గోడల్లేన బడులలో పుస్తకాల్లేని చదువులు మొదలైయ్యాయి.
మృత దేహాలతో సహజీవనం,
రక్తపు రహదారున్ని ఈదడం ,
నైరాశ్యపు భవిష్యత్తు కు మానసిక కసరత్తులు
శిధిలాలను చూపిస్తూ నేర్పుతున్నారు.
ఇప్పుడక్కడ ఏ ఇటుక రాయి ను తడిమినా  స్మృతి గీతమే అవుతుంది,
ఇప్పుడక్కడ ఏ జీవిని కదిపినా  , మౌనరోదనే  వినిపిస్తుంది,
ఇప్పుడక్కడ పొగ చూరిన ఆకాశంతో కాలుతున్న శవాల
వాసన పోటీ పడుతున్నట్టుగా అనిపిస్తుంది,
హనన దహనానికి కాస్త విరామాన్ని విగతులు  ఆర్ధిస్తున్నట్లని పిస్తుంది,
ఎప్పటికీ , గాజా చరిత్ర ఎండన రక్త చారికై నిలుస్తుంది.