-ఈ దేహానికి ఈ దేశము లో రవ్వంత ఉనికి లేదు,
దాచుకున్నది ,దోచుకోవదమో ,
లేనిదానిననో, కానిదానిననో నలిపేసొ, పీకనులిపేసో
ప్రాణాలను గుంజేసే ఆటవికుల ఆధిపత్యపు లోకంలో .
మర్మం లేని మా బ్రతుకుల్లో ఈ మరణగీతాలు
మర్మాంగాల తో పిశాచుల పరాచికాలు .
ఖడ్గ మృగాల కుల చదరంగము లో పావులమై
పాపాలకాల గర్భానికి బలి అయిపోతున్నాము .
ఇక్కడ ఇప్పుడు చెట్లకు కాయలతో పాటూ
మా శవాలు కూడా కాస్తున్నాయి,
ఏ బేతాళుడు వ్రాయని వ్యధల్ను రాస్తున్నాయి.
మరుగు భూమిని మరు భూమిగా మార్చేస్తూ
బలం బలిమి తో కులం కొలిమిలో మమ్మల్ని
కామాగ్ని తో కాల్చేస్తూ, మా కాలానికి కంచెలు కట్టేస్తున్నారు.
మా మానమునే అవమానపు చిహ్నం గా మార్చేస్తున్నారు.
నిర్భయ తల్లికి కష్టం వస్తే చానెళ్ళు , పేపర్లు నెత్తి నోరు కొట్టుకున్నాయి,
పుట్టు నిర్భాగ్యులు ఏమి పాపము చేసుకున్నారో?
నిర్లజ్యపు మీడియా సమాజం నోట్లో ఏమి పెట్టుకున్నారో ?
కలం కారులు కలం , ప్రజా వీరులు గళం మేల్కొనే లేదు,
అవును! దేశానికిప్పుడు రెండు గ్లాసుల పద్ధతికి తోడు
రెండునీతులు, రెండు తీర్పుల పద్ధతులు కూడా అలవడ్డాయి .
కర్తవ్యము కనుచూపు మేరలో కలవరం లేపు తోంది,
సామూహిక దళిత మాన హననం ఏ యుద్ధానికి దారితీస్తుందో?
భయం అయితే లేదు,కానీ,భరోసా అడుగుతోంది
సంసిద్ధం కమ్మని సంకేతాలిస్తుంది.
No comments:
Post a Comment