Friday, 10 August 2018

S -377


ఆకలేస్తే తినడం కూడా తప్పైన జీవితపు  పరాధీనతలో
అడుగడుగునా అడుక్కోవడమో లేదా సణుక్కోవడమో నేటి ప్రజాస్వామ్యం
వాడిచేతిలో అధికారం , పిచ్చోడి చేతిలో హక్కుల అణుబాంబు.
లింగ వివక్ష పరాకాష్ట పరిధులు దాటి పంజా విసరినప్పుడు
చచ్చినట్టు స్వలింగ సమీకరణాలకు సలాము చెయ్యాల్సిందే...
పడగ్గదిలో భాగస్వామి వారినెలా ఆస్వాదించాలో
అశ్వినీ దేవతలా వారసులు ఈల ఊదుతూ చెప్పాల్సిన అవసరం లేదు
అయినా , ఏది సహజమో  ఏది అసహజమో ప్రకృతికే వదిలేస్తే పోలేదూ?
జరిగేదంతా ‘రూల్ ఆఫ్ ది నేచర్’ ప్రకారమే జరుగుతుందని తెలీదూ?
ఎవ్వరికీ హాని లేని అంతర్గత ప్రవృత్తులకు చట్టాలూ శిక్షలూ  ఎందుకు?
రేపు చూషణలూ, చేతి ప్రయాగాలు  కూడా మా పరిధి లోనివేనని
కాదంటే దేశ ద్రోహాన్ని అంటగట్టే అంగ వైకల్యాన్ని నేననుమతించాను
నాలుగ్గోడల మధ్య ఆ  ‘అతి’రహస్య మే శాంతి విఘాతమైతే 
బహిరంగంగా బూతు పురాణాలు భక్తీ ముసుగులో  భోగాలకోసమే
సృష్టించిన ప్రత్యేక  కులాలు ఏ సమానతకు చిహ్నాలు?
 మానవహక్కుల ఉల్లంఘన ఏ ఫాసిజానికి ఆనవాలు?
                                                              
డాక్టర్ మాటూరి శ్రీనివాస్ (12-07-18)

పూనిక


 ఒక తీక్షణ సంకల్పం సామూహికంగా నిశ్చయ బుద్ధితో
 అమాంతం పరిసరాలను తృణ ప్రాయంగా విస్మరించి
 దారీ తెన్నూ లేని ఎడారిలో ముళ్ళ జెముళ్ళ మాదిరి
 సముద్ర గర్భాన స్వాతి ముత్యాల తెన్నుగా
 ప్రపంచాన్ని ప్రాణాలతో పలకరించాలని చేస్తోందొక సుదీర్ఘ తపస్సు
  ఆ విపశ్యనామయ ప్రశాంతతకు అనుకంపతో మద్దతుగా
 తనవంతు ఆలంబనందిస్తూ సహా ధ్యానిగా లాండ్ లువాంగ్ గుహ

 అక్కడ ఆ బిలంలో చీకటి చిచ్చులో చిత్తడి రొచ్చులో
నిరంతరం  నిశ్శబ్దపు కటికత్వం హాహాకారాలు చేస్తుంది
 మధ్యలో గబ్బిలాల ఊళలు వాళ్ళ దైనందిన స్వేచ్ఛతో పోటీ పడుతున్నాయి.
 భయం వింత వింత శబ్దాలతో మారుడిలా నాట్యమాడుతోంది
 దిగులు జయిస్తానాని ధీమాగా గుహ గోడను మెల్లగా ఆవరిస్తోంది
 దౌష్ట్యాల  అవిరాళ ఆటంక  ప్రయత్నాలన్నిటినీ  తిప్పి కొడుతూ
 అంతటి తమస్సులో ఒక తపోధనుని సాన్నిధ్యంలో శ్రావకులై
 అభినవమైన మొక్కవోని నిశ్చలత తో ఆ యవ్వన  సమూహం

 ఇక్కడ అలుపెరుగక ప్రాణాన్వేషణ వేటలో మరొక పట్టుదల
 ప్రపంచాన్నేఏకం చేసి ఒక అత్యాధునికతను వేటకు వలగా నేసింది.
 ఎల్లలు దాటొచ్చిన వేట గాళ్ళు సొరంగ మార్గంలో సోదాలకే సవాళ్లు విసిరి
 ఉత్కంకే ఊపిరాడనివ్వక  జలగండాన్ని జయించి శోధించారు
 వైల్డ్ బోర్స్ ప్రాణ రక్షణకోసం  సీల్స్, డైవర్స్ ప్రాణాలను పణంపెట్టి
 సర్వ మానవతను  సమిధిగా వెలిగించిన  ఒక యజ్ఞం
 తల్లులే కాదు సర్వజనమూ  పొలాలూ పల్లెలూ ఊళ్ళే కాదు
 ప్రపంచమే  సంఘటితమై చేసిన ఒక చారిత్రిక అద్భుత సాహసం

 రెండు వారాలుగా ఇరువైపులా ఆకలీ దాహం తెలియనీ
 అయినవాళ్ళ ఆనవాళ్ళు  కూడా గుర్తురాని అధి భౌతికత వాతావరణంలో
 ఆలోచనలు లేవు ఆశలు లేవు ఆందోళనలు లేవు ఆశయమొక్కటే
 ఆ కొండ కుహరంలోని వారికి ప్రాణ వాయువయ్యింది
 యజ్ఞ సాకారమైంది  తపస్సు సాఫల్యమైంది కలగలిసిన
 ధ్యానమే చివరకు ఆ సంకల్పానికి  ప్రాణమైంది  .

                                    డాక్టర్ మాటూరి శ్రీనివాస్ (15-07-18)

నేనూ- నా ప్రస్థానం


నేనూ , నా ఈనాటి మనుగడ ఎన్నో మరెన్నో త్యాగ,శ్రమ ఫలితాల మిశ్రమం
ప్రక్రుతిని  సవాలు చేసి నన్ను ప్రపంచానికి  పరిచయం చేసి అమ్మను
మెలిక పడ్డ కన్నపేగును సవరించి గర్భస్థ చివరి వోడుదుడుకులను
సరిజేసిన  పరోక్ష్య ప్రసన్న పరమావౌషధపు పుణ్యాత్ముల కధ  ఒకటుంది...
ప్రాణాలు పోయడమే దాని ప్రధాన ప్రధమ అంతిమ కర్తవ్యం .
అమ్మ పురిటి నొప్పుల్ని మాటు మాయం చేసి, తనకి సుఖ ప్రశాంత ప్రసవాన్ని
 ప్రసాదించిన లేబర్ అనల్జేసియా, అనస్తీషియాల అవిరామ కధ అది ,
ఆ మత్తుమందుల గమ్మత్తుకు చిత్తైంది నరకయాతన సమానమైన అమ్మ ప్రసూతి వేదన
బయటపడుతూ ఉప్పగా ఉందని చప్పరించానా, కమ్మ నీరనుకుని నా ఉమ్మ నీరును నేనే
ఇక  ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైయ్యానా  ఏడవడం కూడా కష్టమైన నా అంతర్వేదన చెప్పలేను.
నా నాసికా కవాటాల్లోంచే  కాక నవరంధ్రాల్లోకి చోచ్చుపోయిందట
 పిండంతో మొదలై నాతో పాటూ  జుగల్బందీగా ఎదిగిన ఉబ్బ జలం
 అమ్మ ప్రేమ ఫలం నన్ను విడవలేని ఆప్యాయతా  బలం అనుకుంటా..
నన్నావరించి అతలాకుతలం చేసి నప్పుడు దాన్నంతటినీ
పీల్చేసి గుండె శబ్దాలను లయ పరచి  గాలిని నింపి పసి నెత్తురు కందుకు ప్రాణం పోసి
పునర్జీవింపచేసిన నియోనేటల్ అనస్తీషియా ప్రతిభకే నేనెప్పుడూ గులామునే కదా!...

అంతటితో ఆగిందా? నా జీవన్మరణ యాత్ర మజిలీ లేని మత్తు వైద్య జాతర
అదేమీ వైపరీత్యమో పొట్టలోని చిన్న పేగు ముడి పడిందని శరఘాతంలా స్కానింగ్ రిపోర్ట్
  ఈ  సారి శస్త్ర చికిత్స తోగానీ గత్యంతరం లేదట,లేదా నాకీ భూమ్మీద నూకలు చెల్లాట
ఇక ఆ మృత్యు మహమ్మారిని జయిస్తానో లేదో? ఎదో తెలియని భయం ఆవరిస్తున్నా
దుఃఖం అంచున విలపిస్తున్న అమ్మకు  ధైర్యం చెప్పాలని ఉంది
కానీ చెప్పే వయసూ లేదు,మాటలూ రావు ఇంకా నిండా బయట పడలేదుగా !??
నాలోనేనే ఇద్దరినీ వోదారుస్తున్నాను నన్నూ అమ్మనీ ,
ఈ లోగా ఆపద్బాంధవుల్లా అన్నీ తామై మళ్ళీ వాళ్ళే- ఆ మత్తుమందు వైద్యులే
 ప్రత్యక్ష్య మయ్యారా ...అబ్బా ఎంత హాయిగా ఊపిరి తీసుకున్నానో?
ఎ పరేషాన్ లేకుండా ఆపరేషన్ జరిగిపోయింది.
అది నుండీ, మధ్యలోనూ , ఆఖరి వరకూ తిరిగి తెలివిని పునః స్థాపితమైయ్యేవరకూ
నా ప్రాణానికి కంటి పాపలైయ్యారు  నిస్వార్ధ సేవకులయ్యారు నా జీవన దాతలైయ్యారు
నాకర్ధమైయింది .... వీరు అభేధ్యులు . మృత్యువును ఇక  నా చెంతకు ఇక చేరనివ్వరు
 ఏ ఆత్యయిక స్థితిలోనూ నిరంతర అప్ర ‘మత్తులు’
క్రిటికల్ కేర్ నిష్ణాతులు, భౌతిక మానసిక శస్త్ర ఆరోగ్య పర మైన ఎటువంటి
వ్యాకులతనైనా
చిటికెలో మటుమాయం చేసే మత్తు వైద్యం వీళ్ళ సొంతం
నొప్పి  విమోచనా మార్గం  వీళ్ళ పంతం
తీవ్ర రోగాల జీవిత చరమాంకానికి  సైతం స్వాంతననింపడం  వీళ్ళ నైజం
వాళ్ళ కళ్ళు నిరంతరం వైద్యమే  మాట్లాడతాయి, త్యాగం చేయాలని మెదడు ఉరకలేస్తుంది
ప్రాణంతోనే వాళ్లకి అనుబంధం దుఃఖ ఉపశమనంతోనే వాళ్లకి సంబంధం
నేను కొన శ్వాసతో కొట్టుమిట్టాడుతున్న ప్రతీసారీ నన్ను బ్రతికిస్తూ
బ్రతకాలన్న నా ఆశను బ్రతికించారీ ప్రాణ ప్రతిష్టులు, జీవన లైన్ మెన్లు
నిరాడంబర నియమ నిష్ట సుశిక్షిత కార్యదీక్షుతులు అనస్థటిస్ట్ లు........

                                               ...డాక్టర్ మాటూరి శ్రీనివాస్
                                                   27-07-18

శిధిల జ్ఞాపకం



ఈ నా దేశం వేల సంవత్సరాలుగా దురాక్రమల పరం పరలకు
ఆధిపత్య వలస పోరులకూ అవిశ్రాంత విధేయరాలు   
మూలవాసులకిక్కడ ఎప్పుడూ ఇది  అంటరాని వసంతమే  
అప్పుడు సందట్లో సడేమియా ఇప్పుడు శ్వేతజాతి బడేమియా
తెల్లవాళ్ళ నల్ల చట్టాల కాళ్ళకింద నలిగి పోయిన మొగలిపూవు ఈ దేశం
స్వేచ్ఛావాయువుకై మొహం వాచిన నిస్సహాయ జటాయువు ఈ దేశం  
అయినా అలుపెరుగని  స్వాభిమానపు ఆనవాళ్ళు   
అక్కడ  బెంగాల్ పులులై ఆత్మాధీనతకై పంజాల విసురుతున్నాయ్   
ఇక్కడ నిర్విరామ హిమాలయ పాద పధం నుండీ దేశభక్తిని స్రవిస్తూ 
పంజాబ్ కిర్పాణ్ లు  తమ రోషానికీ తలమానికమైన సవాళ్లు చేస్తున్నాయ్
జవాబు వెతుకులాటలో బ్రిటీషు సామ్రాజ్యపు అహం బొక్కబోర్లా పడింది
గతిలేక రౌలత్ ఆరాజక విప్లవ నేరాల అభియోగ ప్రతీకారం దారికాసింది     
కానీ, మిలియన్ల భారతీయుల స్వాతంత్రోద్యమ కదంబాన్ని కాలరాయలేక   
వైశాఖి పర్వదినాన్ని పండగ చేసుకోబోయిన ఉద్యమ నిరసన తోట లోకి
వోర్వలేని బ్రిటీష్ పునాదులు కదలిక, విచక్షణ వీడి
డైయర్ రూపంలో మరణశాసనంతో ఉగ్ర మదాన్ని ఉసిగొల్పింది
ఆ సన్నని దారి అమాంతం రెండు బహుముఖ తూటాల ఫిరంగులగా మారి    
జలియన్వాలా బాగ్ ను  మృగ ప్రాయమైన ఉదంతంగా రక్తాక్షరాలతో రాసింది
అమృత సరోవరం రక్త దాహాన్ని రుచి చూడాల్సిన గర్హనీయ సందర్భమది  
స్వర్ణ మందిరం వర్ణ విహీనమై కంపించిన అఘోర మానవ హననమది  
వందల రౌండ్లు వేల ప్రాణాలను చాటునుండీ వచ్చి గుట్టుగా మింగేసాయ్
మందలకొద్దీ  దారీ తెన్నులేని నిరాయుధుల్నిదిగ్బంధించి  నిస్సిగ్గుగా  
బుల్లెట్లు తోట గోడలకు నిలివునా సిలువలు వేసి కక్ష సాధించాయ్
సమరసతను చిందించాల్సిన వేల కత్తులక్కడకక్కడే నేలకొరిగాయి
బాగ్ ఊరబావి లోని నీళ్ళకు బదులు మృతులు సవాలై ఊరగా   
అక్కడ దుఃఖపు మబ్బులు ఇంక ఇప్పటికీ వీడనే లేదు  
చేతకానితనపు యుద్ధనీతి ఇలానే ఉంటుందని గోడల మీద తూటాలు
చేసిన రంధ్రాలు నిరంతరం సామ్రాజ్యవాదులను వెక్కిరిస్తూనే ఉంటాయి
పూర్వీకులారా ! మీ నెత్తురు వృధా కాలేదు భవిష్య  స్వప్నానికి   
నరమేధం లోంచి విప్లవం  చిగురించేలా ఎన్నో జ్యోతులు వెలిగించింది
 ఆ చైతన్యపు భుగ భుగలను  భగత్ సింగ్ అని పిలుచుకున్నాము   
 స్వతంత్రోద్యపు ఆఖరి పోరాటపు  నాందిగా కొలుచుకుంటుంన్నాము . 
                                                          డాక్టర్ మాటూరి శ్రీనివాస్ (10-08-18)

Saturday, 17 February 2018

సమ్మోదము


సమ్మోదము

..................



గులాబీల గోముతనానికి ఎవ్వరైనా గులాములౌవాల్సిందే కదా!

ఏ రంగులో పూసినా ఆ అందాన్ని ఎంతగౌరవిస్తాము ?

ఆ సుకుమారత్వాన్ని ఎంతగా ఆస్వాదిస్తాము?

మరి,రకరకాల మనుషులను కూడా అలా ఎందుకు చూడలేకపోతున్నాము?

ఒక్కొక్కరూ ఒకో తెలియనితనాన్ని వెదజల్లుతారని ఎందుకు అనుకోము?

ద్వేషించడానికి కారణముండాలేమో...

మానవ పరిమళాన్ని ఆఘ్రాణించడానకి అక్కర్లేదు.

నిద్రావస్థలోనున్న ప్రేమతత్వాన్ని మేల్కొలిపితే చాలు.

కనిపించే ముళ్లు గ్రుచ్చుకుంటాయని తెలిసు

అయితేనేం రోజాలను  రోజూ 

ఆనందించడం లేదూ!

కనిపించనివన్నీ చిక్కుముళ్లేనని ఎందుకు భావించాలి?

మానవ మానస సరోవరాలెందుకు కాకూడదూ!?

పూచిన పూలకు కూడా సొట్టదీ గ్రుడ్డిదీ అని పేర్లు పెట్టే నైజాన్ని ఎప్పుడు వదల్చుకుంటామో అప్పుడు 

సహజంగానే మానవతా మంజరిగా గుభాళిస్తాము...



      డా.మాటూరి శ్రీనివాస్


నీలోనే సర్వం


నీలోనే సర్వం

........



శత్రువు ఎక్కడో లేడు

ఒక్కసారి తరచి తెరిచి చూసుకో

నీలో సంచరిస్తున్న సర్వాంతర్యామి వాడు



నీ శ్వాసలో ఇమిడి

నీధ్యాసలో లీనమైపోయి

నిరంతరం నీలోనే ప్రవహిస్తూ నిన్ను సాసిస్తున్నాడని ఎప్పుడైనా గమనించవా?

అచ్చం గాలిలా...

రంగు రుచి వాసన కనబడనీకుండా కాల్చేస్తున్నాడని కూల్చేస్తున్నాడని ఎప్పు తెలుసుకుంటావో అప్పుడే 

జీవిస్తావు





నీలోనే తనను బ్రతికించు కుంటున్నాడు

సత్యాన్ని బ్రహ్మ పదార్థంగా

దుఁఖాన్ని సచ్ఛితానందంగా

చిత్రిస్తున్న మాంత్రికుడు

నీ మౌఢ్యానికి రెప్పలేని పహరా వాడు

నీ మౌనానికి అధిపతి

భావదారిద్ర్యానికి భీమా వాడు

మానవ సంబంధాల మారణాయుధం వాడు



అజ్ఞానం అనే క్రిప్టో కరెన్సీతో తెగ వ్యాపారాలు చేస్తున్నాడు

పుణ్యాన్ని లాభాలుగా చూపజూస్తున్నాడు



నీ ఎరుక లేనితనమే నీలోని శత్రువుకు పెట్టుబడి

నీలోని చీకటితో వాడు వెలిగిపోతున్నాడు



బతికున్న శవంగా సమాజానికి భారమౌతావో

చావుకు వెరవకుండా శత్రు సంహారివై సమాజా భారాన్ని తీరుస్తావో....



         మాటూరి శ్రీనివాస్

నిజంగానే....


నిజంగానే....



వినీలాకాశాన్ని ఎప్పుడూ ఇంత హృద్యం గా నేను చూడలేదు

నిర్మలంగా పరుచుకున్న సాగర కెరటాలతో పోటీ పడడాన్ని 

తీరాన కేరింతల గిరికీలను ఆకాశం   ఆస్వాదించడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు

సునీలకాలను హత్తుకుని అద్దుకున్న మేఘాల్లోంచి 

అటుగా ఆవల ఊదారంగును విశ్లేషిస్తూ కనువిందుగా వెలుగురేడు అవ రోహిణి

ఇటుగా  ఈవల మెల్లగా చల్లగా ఉధ్భవిస్తూ నెలరేడు అధిరోహణ

జమిలిగా గగనాన జుగల్బంధీ ని నేనిప్పుడే చూస్తున్నను.



ఒక ముగింపు మరొక ప్రస్థానానికి నాంది.

మనసు కాలయంత్రంలో రివ్వున వెనక్కి పరిగెత్తడాన్ని నేను గమనిస్తున్నాను,

చెంప చాటున దాగిన గులాబి సిగ్గుతో తిరిగి మొగ్గైంది

అమాంతంగా అందరం బాల్యంలోనికి పరుగు తీసింది

జల్సా పంచుకుని పండగ చేసుకొమ్మని ప్రకృతి వగలు కొమ్మలను చెంత చేర్చింది



అంత వరకు ఊహకందని అందమేదో అందర్లో ఆవహించింది.

తృప్తికి అంతం ఉంటుందా?

కాస్తంత లోటే ఆ తృప్తికి అందం

కానీ, ఏలోటూ కానరాని అఖిలమైన తనివి తీరడాన్ని నీవెప్పుడైనా అనుభవించావా?

అన్నీ కలగలిపిన మధురామృతాన్ని చెలిమితో ముడివేసి బంధీని ఏమంటారో తెలుసా?

అవధుల్లేని ఆప్యాయతలు సాగర సంగమరీతిని మరపిస్తే,

సైకత తీరాలు తీయగ హత్తుకుని ఆత్మీయంగా గిలిగింతలు కల్పిస్తే

అలవికాని ఆ పెన్నిథిని ఆసాంతం సొంతం చేసుకుని 

మనసు మూలలలో నిక్షిప్తం చేసేసి 

ఆ జ్ఞాపకాల శాశ్వత తాళం వేసేస్తే ఏమంటారు?

ఆ అరుదైన బంధాన్ని 

HAVE-LOCK అని కాక మరేమంటారు.



సుదూర తీరాలు దాటి ఖండాంతరాలను మీటి అనుబంధమే సంబంధంగా

సుభద్రంగా శుభప్రదంగా

ఆవిష్కరించుకున్న మా అన్నోన్య అభిమానం ఎంత ప్రయత్నించినా లోతైన సాగర గాఢతకు కూడా అంతు చిక్కడం లేదు.

నవ్వులనే ప్రాణవాయువుగా

మాటలనే

మిఠాయిలుగా పంచుకుంటూ నిండు పూర్ణ చంద్రిక ఆలంబనలను ఆస్వాదిస్తూ సాగిన మైత్రీ ప్రయాణం అవిరామం గా

దిగంతాల తీరాలవైపు

అనంతాల పార్శ్వాల వైపు

అను నిత్యం సాగడాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను.



వెన్నలలోని అలల మిలమిలలు గొంతుల గలగలగలతో పోటీ పడడాన్ని అనుభవిస్తున్నాను.



కాంతలీను కమనీయ ఉషోదయాలను మేల్కొల్పడం

అరుణోదయ వేళ  మాంగ్రూవ్ వృక్షాలు కళ్యాణి రాగాలాపన చేయడం నేనిక్కడే చూస్తున్నాను.



యావత్ జల సంపద కూడా ఏ ఒక్క కోహినూర్కు సరితూగలేదని తెల్సింది

మరి, ఎన్నో కోహినూర్లు ఒకే చోట మెరిస్తే అది భూతల స్వర్గ కాక మరేమౌతుంది..?



భూదేవి కి తోడుగా శ్రీదేవి లక్ష్మీ కటాక్షం సోగ సిరులను కురిపిస్తుంటే,

మా శ్రేయస్సు

నిరంతర అప్రమత్తత 

పద్మపాణీ 

ప్రత్యక్ష పలకరింపుతో

పరోక్ష్య పలవరింపులతో నన్నలరించడాన్ని నేను అనుసరిస్తున్నాను



కాళికా పూనిక ఒక్క మాదిరిగా ఆవహించి అలరించి పరవశించడాన్ని

బాల రత్నగా అవతరించడాన్ని  నేను ఆనందిస్తున్నాను.



ఆ పరవశ ప్రాంగణంలో నిదురను దరి చేర నీయకుండా ఎన్ని లాలి పాటలు పాడుకున్నానో జీర పోయిన నా గొంతు కు కూడా అంతు పట్టడం లేదు



ఇక, గతిలేని జోరుగాలి ఈలపాట నావబాట చతికిలపడక తప్పలేదు



ఉండబట్టలేని నిండు చందమామకు కన్నుకుట్టిందో ఏమో

సంభ్రమశ్చర్యాలను కప్పి పుచ్చేందుకో ఏమో

అవని ఆవల వయ్యారంగా దాక్కో ప్రయత్నించింది

సూర్యగ్రహంతో దొంగాటలాడింది



అయినా...ప్రపంచమే ఒక్క చోట చేరినప్పుడు

భూమి సూర్యచంద్రులు 

ఒక్క కక్ష్యలో చేరి సయ్యాటలాడడంలో వింతేముంది..



రత్నాకర పురిలో మానస సరోవరాన్ని తలపించు

అను రాధా నగరిలో

భాస్కరుని సమ్మోహన వీడ్కోలు ఒక ప్రక్క

కలువ రాయుని చంద్రతాపపు కుంచె చిత్రిస్తున్న కమనీయ కౌముదీ హేల మరొక ప్రక్క

ఆ క్షణాలను  ఆస్వాదించడమే జీవిత పరమార్థంగా అనిపించడం ఒప్పే అనిపించిందక్కడ నాకు



అలుపూ సొలుపూ లేని మా సుజాతకానికి అందిరితో పాటూ నేనూ ఎంత మురిసిపోయానో!!

జాపోత ఎరుగక మరపురాని పూత పూసిన నవ్వుల విరి జాత కు నేనెప్పుడూ దాసోహమే

ప్రశాంతతే ఆభరణంగా

స్వశ్ఛీలత సంచరిస్తున్న స్నేహావరణానికి గులాములు కానిదెవ్వరు?.



అల్లంత దూరాన ఏదో తెలియనితనంతో

నల్లని కురుల కను సన్నలల్లోంచి శైలు కళ్లు

అలల నురగల్లో సంచరిస్తున్న మీనాలతో 

పోటీ పడడాన్ని 

లంగరేసుకుని స్వేద తీరుతున్న పడవ పసిగట్టడాన్ని నేను గమనిస్తున్నాను..

చిరు ఆటు పోట్లతో తన నిశ్శబ్దానికి భంగం కల్గిస్తున్నా 

నావ తన సహజ సహన ఔదార్యాన్ని నేను పూజిస్తున్నాను

ఏటి దివిటీలలా నీటి కెరటాలు ఆత్మీయ ఆలింగనాన్ని 

మమ్మల్ని ఆవరించి తన ప్రియత్వాన్ని చాటడం నేను అంతర్ముఖుడనై 

ధ్యానిస్తున్నాను....

ఆ ధ్యానంలో మైత్రీ భానవను నిస్వార్థంగా శ్వాసిస్తున్నాను.. 

  .......



          మాటూరి శ్రీనివాస్

                  04-02-18

నా దృష్టిలో పద్మావత్


నా  దృష్టిలో పద్మావత్





"పద్మావత్" అందరూ చూడాల్సిన సినిమా.ఎందుకంటే మొదటది అది చరిత్ర ఆధారంగా తీసినది. రెండవది కర్ణి సేన విభేధించాల్సినది ఏముందో తెల్సుకోవడానికి..మూడవది  సినిమాని అర్దం చేసుకోవడానికి..నాల్గవది బన్సాలి మేధను అంచనా వేయడానికి. నేను పై నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకునే చూసాను.

     సంజయ్ లీల బన్సాలి ప్రతిభకు అద్దం పట్టిన సినిమా ఇది. అందుకే దీన్ని అతడి మేగ్నం ఓపస్ అని పొగుడుతున్నారు. టెక్నికాలటీస్ హాలివుడ్ స్థాయిలో ఉన్నాయ్. కాస్ట్వూమ్స్ మనల్ని 13 శతాబ్దానికి తీసుకెళతాయ్.3D ఎఫెక్ట్ అక్కడక్కడ సినిమా సీరియస్ నెస్ ని పలచబరించింది.కొన్ని సందర్భాల్లో ఏనిమేషన్ లా అనిపించింది.  జయేసి కావ్యం ఆధారితం కాబట్టి ఇప్పుడు దాన్ని చదవాలనిపించిడం సహజమే. నాటి ఆచార వ్యవహారాలను సాంఘీక దురాచారాలను(సతి,జొ   వర్) చూపడం అనేది సినిమాలో కేవలం ఒక కోణం మాత్రమే. దాన్ని చూపడానికి అభ్యంతరం తెలుపని కర్ణి సేన...ఈ క్రింది అంశాల పై యుద్ధం ప్రకటించింది. 1. పద్మావతి యద్దనీతి ని ప్రకటించడం, 2.భర్త ను విడిపించుకునే నేపధ్యంలో ఖల్జీ ని కలవడానికి వెళ్లడం,3.ఖిల్జీని ఒక సామ్రాజ్య స్థాపకునిగా చిత్రించడం.4.రాజపుత్రుడు రావల్ రతన్ సింగ్ బంధీ అవడం 5.ఆనక భార్య (పద్మావతి)తన చాతుర్యంతో విడిపించడం....6.పిమ్మట రాజు ఖిల్జీతో యుద్ధంలో  ఓడిపోవడం లాంటి నాటి సహజ సామాన్య అంశాలు.7.రాణి పాట పాడి డాన్స్ చేయడం(చేసింది రాజస్థాన్ సంప్రదాయ నృత్యమే)     ఈ అంశాలు నేడు రాజపుతానా పురుషాహాంకార మనోభావాలు దెబ్బతీసాయనడం ఖచ్చితంగా రాజకీయమే. మనోభావాలతో ఆడుకోవడమే ఒక రాజకీయం. మనోభావాలనేవి ఆధిపత్యపు దురంహాకార ముసుగులు. మరి నాటి ముస్లీం రాజుల మనోభావం దుర్మార్గం దౌర్జన్యం. ఘజనీ ఖిల్జీల చరిత్ర రక్తసిక్తటిమనేది కొత్తవిషయం కాదు. మరి నేడు అగ్రవర్ణ(రాజ్పుత్) మనోభావాలు ఏమైనా భిన్నంగా ఉన్నాయా(వారు సృష్ఠించిన కల్లోలం, సినిమా నిషేధం, చేసిన ఆస్తి నష్టం, రాజకీయ అధికార దురంహాంకారం).? ఎన్నో రివ్వ్యూలూ ఎన్నోవార్తలూ సినిమాకి అవసరానికి మించి పబ్లిసిటీ తెచ్చి పెట్టాయ్. చరిత్రని చరిత్రగా సినిమాని సినిమాగా చూడలేని, చదవలేని మనోభావాలు మనోభావాలు కాదు,మనోదుర్భలతలు. మరొక కీలక అంశం సినిమాలో పద్మావతి తీసుకున్న నిర్ణయూలు..భర్తైన రాజును విడిపించడాని బయలు దేరడం (అంటే అంతఃపుర స్త్రీ కోట దాటకూడదనేది నాటి దురాచారం) అదీ తనముఖాన్ని చూడడంకోసం పరితపిస్తున్న ఖిల్జీ దర్బారు కు వెళ్లడానికి నిశ్చయించుకోవడం లాంటి నిర్ణయాలు వారిని గాయపరిచి ఉంటాయ్. ఇక్కడ కర్ణి సేన బన్సాలి ప్రతిభను అంచనా వేయడంలో విఫలమైయ్యారు. పద్మావతి భారతీయ మహిళ కాదు.ఆమె సింహళీ రాజ కుమార్తె. సింహాళ దేశం బౌద్ధ దేశం. ఆ నేపధ్యం సినిమా ఆరంభంలో చాలా సేపు కనబడుతుంది. ఆమె లోని బౌద్ధ తాత్త్వికత ధైర్యంగా నిర్ణయాలను తీసుకునే మనోబలాన్ని ,పురుషునితో సమాన స్థాయిని ప్రదర్శింపచేసాయనుకోవచ్చు. పైగా ఆమెకు విలువిద్యలో ప్రవేశంకూడా ఉంది. అయితే చిన్నరాణిగా, మేవార్ రాజుకు భార్యగా, రాజపుత్ ల నాటి సతి ఆచారాన్ని కూడా గౌరవించి తన ఔన్నత్యాన్ని చాటుకున్నట్లు బన్సాలి ఆమె పాత్రను చెక్కాడు. సినిమాగా కలెక్షన్ పరంగా ఇదొక బ్లాక్ బష్టర్. చరిత్ర ఆథారిత కథ మాత్రమే,సినిమా కాదు.

ఖిల్జీ నాటి చరిత్ర ప్రకారం హీరో (సినిమా లో విలన్). ఇది అతని చుట్టూ అల్లిన కథ అనీ, ఇతరత్రా అన్నీ కల్పతాలని బన్సలీ చెప్పాడు కదా!.. ఇంకెందుకు రాజకీయం. చివరిగా అతి ప్రథానమైన అంశం.....ఇది ఈ మథ్య వచ్చిన కుటుంబ సమేతంగా చూడదగ్గ ఏకైక సినిమా గా నన్ను అలరించింది.